ప‌వ‌న్‌క‌ల్యాణ్ క్లాప్‌తో సాయితేజ్ కొత్త చిత్రం

    Written By: Last Updated:

‘చిత్రల‌హ‌రి’, ‘ప్ర‌తిరోజూ పండ‌గే’ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ’ప్రస్థానం’ వంటి డిఫరెంట్ మూవీని  తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు దేవ క‌ట్ట ద‌ర్శ‌క‌త్వంలో గురువారం కొత్త చిత్రం ప్రారంభమైంది. జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్స‌వ వేడుక‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, ప్ర‌ముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, ఎ.ఎం.ర‌త్నం, ప్ర‌ముఖ ఫైనాన్సియ‌ర్ ఎం.వి.ఆర్. ప్ర‌సాద్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.
ముహూర్త‌పు స‌న్నివేశానికి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ క్లాప్ కొట్ట‌గా.. అల్లు అర‌వింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వంశీ పైడిప‌ల్లి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం చేశారు. అల్లు అర‌వింద్ స్క్రిప్ట్‌ను అందించారు. ఏప్రిల్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం.. శ్యామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా …
ద‌ర్శ‌కుడు దేవ క‌ట్ట మాట్లాడుతూ – ‘‘ఎగ్జ‌యిట్‌మెంట్ క‌లిగించే అద్భుత‌మైన క‌థ‌తో చేస్తున్న సినిమా.సాయితేజ్‌, నివేదా పేతురాజ్‌, మ‌ణిశ‌ర్మ‌, శ్యామ్ ద‌త్‌, నిర్మాత‌లు భ‌గ‌వాన్‌గారు, పుల్లారావుగారు ఇలా క‌థ‌కు త‌గిన‌టువంటి ఎక్స్‌ట్రార్డిన‌రీ టీమ్ కుదిరింది. మా టీమ్‌ను ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారు, అల్లు అర‌వింద్‌గారు, వంశీపైడిప‌ల్లి, ప్ర‌ముఖ నిర్మాత‌లు బీవీఎస్ఎన్ ప్ర‌సాద్‌గారికి, ఎ.ఎం.ర‌త్నంగారికి కృత‌జ్ఞ‌త‌లు. ఏప్రిల్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది’’ అన్నారు.